Chandrababu : వైసీపీ నేతల కుటుంబాల జోలికి వెళ్లొద్దు.. చంద్రబాబు మార్పు కోరుకుంటున్నారా..?
Qubetvnews - November 10, 2024 / 06:09 PM IST
Chandrababu : ఏపీ రాజకీయాల్లో జరిగినంత రచ్చ వేరే రాష్ట్రాల్లో ఎక్కడా జరగదేమో. అంతటి స్థాయిలో ఇక్కడ రాజకీయంగా రచ్చ జరుగుతూ ఉంటుంది. రాజకీయాల్లో ఉన్న వారిపై విమర్శలు చేయడం హుందాతనం. కానీ నేతల కుటుంబ సభ్యులపై దారుణమైన కామెంట్లు చేసే సంస్కృతి కూడా ఉంది. ఇది చాలా వరకు హేయనీయమైనదే. అయితే దీనికి చంద్రబాబు చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన అధికారంలోకి వచ్చిన కొత్తలో కూడా దీనిపై మాట్లాడారు. జగన్ కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ అప్పట్లోనే చెప్పారు.
దాంతో రాజకీయంగా కొంత మార్పు కనిపించింది. కూటమి నేతలు కూడా వైసీపీ వాళ్లను రాజకీయంగా విమర్శిస్తున్నారే తప్ప కుటుంబ సభ్యులను మాత్రం విమర్శించడం లేదు. నిజంగా ఇదే అసలైన రాజనీతి అంటున్నారు. శత్రువులు మనల్ని తిట్టారని.. మనకు ఛాన్స్ వచ్చినప్పుడు తిడితే వారికి మనకు తేడా ఉండదు. అలా కాకుండా కొత్త శకానికి నాంది పలికే రాజకీయాలు చేస్తే వారికి ప్రజల్లో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించినట్టు ఉన్నారు. అందుకే ఈ విషయంలో కూటమి నేతలకు కూడా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు.
సోషల్ మీడియాలో ఆగడాల గురించి ఆయన స్పందించారు. వైసీపీ నేతలు కూటమి నేతల కుటుంబ సభ్యుల మీద దారుణమైన కామెంట్లు చేస్తున్నారని.. వారిని వదిలిపెట్టబోమన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలపై నీచమైన కామెంట్లు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామంటూ చెబుతున్నారు. అటు ప్రతిపక్షాన్ని హెచ్చరిస్తూనే ఇటు కూటమి నేతలకు కూడా వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేయొద్దంటూ చెప్పారు. అలా చేస్తే అస్సలు క్షమించేది లేదని.. వారి లాగానే చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదే ఇప్పుడు చంద్రబాబు మార్పు కోరుకుంటున్నారని చూపిస్తోంది. ఇన్ని రోజులు ఒక విధంగా నడిచిన ఏపీ రాజకీయాలు.. ఇక నుంచి మారాలని దేశం దృష్టిలో హుందాతనంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే ప్రజల్లో ఆయన ఇమేజ్ ను కూడా పెంచుతోందని పొలిటికల్ క్రిటిక్స్ చెబుతున్నారు.





