Revanth Reddy : టీపీసీసీ పదవిపై రేవంత్ కీలక నిర్ణయం.. వదులుకోనున్నారా..?
Qubetvnews - June 28, 2024 / 08:44 PM IST
Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అట్టడుగున ఉన్న సమయంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎన్నో సమస్యలను దాటుకుని ఆయన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. దాంతో ఆయనకే సీఎం పగ్గాలు కూడా ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అనుకున్నట్టుగానే ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సక్రమంగానే నడుపుతున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీని వీడిపోయిన వారంతా.. తిరిగి కాంగ్రెస్ బాట పడుతున్నారు.
మరీ ముఖ్యంగా బీఆర్ ఎస్ నుంచి ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. అయితే ఈ చేరికల విషయంలో చాలా మంది కాంగ్రెస్ సీనియర్లు అలకబూనుతున్నారు. ఎందుకంటే తమ నియోజకవర్గంలో తమ ప్రత్యర్థులను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ఏంటని భగ్గుమంటున్నారు. మొన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను చేర్చుకోవడంతో సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దాంతో కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల దాకా ఈ పంచాయితీ చేరింది. దీనిపై రేవంత్ ను వివరణ కోరారు ఢిల్లీ పెద్దలు.
ఎందుకంటే ఇక నుంచి దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ లీడర్లు ఒక్కరు కూడా చేజారి పోకుండా చూసుకోవాలని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రతి ఒక్క లీడర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ మీద సీనియర్లు అలక బూనడంతో ఈ విషయం ఢిల్లీ పెద్దల దాకా వెళ్తోంది. దాంతో అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని నడపలేక రేవంత్ ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే తన మీద ఒత్తిడి తగ్గించుకునేందుకు రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన నిన్న మాట్లాడుతూ.. టీపీసీసీ పదవిని వదలుకుంటానని తెలిపారు.
ఎలాగూ రేవంత్ టీపీసీసీ పదవి చేటట్టి జులై నెలకు మూడేండ్లు పూర్తవుతుంది. కాంగ్రెస్ లో అధ్యక్ష పదవి మూడేండ్ల వరకే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రేవంత్ ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారంట. ఎలాగూ తాను కలలు గన్న సీఎం పదవి ఆయన సొంతం అయింది కాబట్టి.. పార్టీ చీఫ్ బాధ్యతలను వదులుకోవాలని భావిస్తున్నారు.


