Revanth Reddy : మంత్రి పదవులు లేవు.. మరి ఏం చెప్పి రేవంత్ బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తున్నారు..?
Qubetvnews - June 30, 2024 / 08:07 PM IST
Revanth Reddy : తెలంగాణలో ఇప్పుడు బీఆర్ ఎస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. పార్టీ గ్రాఫ్ పెరగడం దేవుడెరుగు.. కనీసం పార్టీలోని ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కూడా కష్టం అవుతోంది. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి.. ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గాల నేతలతో.. చివరకు కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అయినా సరే ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా చూడలేకపోతున్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గ్రాఫ్ పెంచాలని అనుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో మెజార్ట సీట్లు సాధిస్తే ఆటోమేటిక్ గా మళ్లీ బాల్ తన చేతుల్లోకి వస్తుందని కేసీఆర్ భావించారు.
కానీ ఘోరాతి ఘోరంగా ఒక్క సీటు కూడా బీఆర్ ఎస్ దక్కించుకోలేకపోయింది. దాంతో బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. అయితే ఇన్ని రోజులు బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఆశ చూపించి చేర్చుకుంటున్నారనే చర్చ జరిగింది. కానీ దానికి రేవంత్ చెక్ పెట్టారు. బీఆర్ ఎస్ నుంచి వస్తున్న ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఉండవని తేల్చి చెప్పేశారు. కాంగ్రెస్ బీఫాం మీద గెలిచిన వారికి మాత్రమే మంత్రి పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. అయినా సరే బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పడుతున్నారు.
మరి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు రేవంత్ ఏం చెప్పి చేర్చుకుంటున్నారనే చర్చ ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు బీఆర్ ఎస్ లో కూడా మొదలైంది. అయితే రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు.. ఇప్పుడు కాకపోయినా వచ్చే ప్రభుత్వం మనదే అని.. అప్పుడు కచ్చితంగా మంత్రి పదవులు ఇస్తామని ఆశ చూపిస్తున్నారంట. పైగా ఇప్పుడు తెలంగాణలో బీఆర్ ఎస్ మునిగిపోయే నావ అని.. కేసీఆర్ ఫ్యామిలీని కేసులు చుట్టుముడుతున్నాయని.. అలాంటి పార్టీలో ఉంటే భవిష్యత్ ఉందని చెబుతున్నారంట. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫాంలు ఇస్తామని.. ఇప్పుడు నియోజకవర్గాలకు అత్యధిక నిధులు కూడా ఇస్తామని హామీ ఇస్తున్నారంట.
అర్హతను బట్టి ఈ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని హామీలు ఇస్తున్నారంట. దాంతో బీఆర్ ఎస్ లో ఉంటే ఎలాగూ భవిష్యత్ ఉండదని ప్రస్తుత పరిస్థితులను చూసి బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు అంచనా వేసుకుంటున్నారు. కాబట్టి వారంతా కాంగ్రెస్ లో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.



