Ys Jagan : వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్న జగన్.. టీడీపీ ట్రాప్ లో పడకుండా జాగ్రత్త..!
Qubetvnews - October 28, 2024 / 06:45 PM IST
Ys Jagan : గత మూడు, నాలుగు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఒకటే చర్చ జరుగుతోంది. అదే మాజీ సీఎం జగన్, షర్మిల ఆస్తుల వివాదం. ఏకంగా కోర్టులో పిటిషన్లు వేసేదాకా వెళ్లింది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తే లేఖలు రాసుకోవడం.. షర్మిల ఏకంగా ప్రెస్ ముందుకు వచ్చి తనకు అన్యాయం జరిగిందని ఏడ్చేయడం.. ఇలా నానా రచ్చ జరిగింది. కానీ జగన్ మాత్రం దీన్ని నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదు. ఈ ఆస్తుల వివాదం ఇటు జగన్ కు రాజకీయ భంగం కలిగిస్తోందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీడియా ఫోకస్, ఇటు ప్రజల దృష్టి మొత్తం ఈ వివాదం మీదనే ఉంది.
ఈ ప్రచారంలో కూటమి ప్రభుత్వ విధానాలను పట్టించుకునే వారే లేకుండా పోయారు. అందరి ఫోకస్ వీరిద్దరి చుట్టూ ఉంది. ఎలాగూ షర్మిల గురించి ఎంత వివరించాలో అంత వివరించేశారు జగన్. అటు వైసీపీ నాయకులు, ఆయన అనుబంధ స్నేహితులు కూడా మీడియా ముందుకు వచ్చి షర్మిల చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టారు. బెయిల్ రద్దు కోసం ఆమె ఏం చేస్తుందో క్లుప్తంగా వివరించారు. ఇందులో టీడీపీ హస్తం ఉందనే విధంగా వారు ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యారు. కాగా ఇప్పుడు జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇంతకు మించి షర్మిల గురించి ఇక మాట్లాడొద్దని డిసైడ్ అయ్యారు. అలా పదే పదే షర్మిల గురించి మాట్లాడితే వైసీపీకి నష్టమే కలుగుతోందని జగన్ భావిస్తున్నారు. పైగా ఈ రచ్చ నడిచినన్ని రోజులు అందరి చూపు జగన్, వైసీపీ, షర్మిల మీదనే ఉంది. అంతే కాకుండా ఈ వివాదం నడిచినన్ని రోజులు ఎల్లో మీడియాలో జగన్ ఏదో చెల్లెకు, తల్లికి అన్యాయం చేశాడంటూ పెద్ద ఎత్తున కథనాలు వడ్డిస్తోంది. కాబట్టి దీనికి పులిస్టాప్ పెట్టేసి.. షర్మిలతో కోర్టులోనే వాదనలు వినిపించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ వివాదం గురించి మాట్లాడటం ఇక్కడితో ఆపేయాలని అనుకుంటున్నారు.
ఎలాగూ షర్మిల గురించి చెప్పాల్సింది ప్రజలకు చెప్పేశాం కాబట్టి ఆమె వైఖరిని వారే అర్థం చేసుకుంటారని భావిస్తున్నారు. వెంటనే కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే పనిలో వైసీపీ నేతలు నిమగ్నం అవ్వాలని జగన్ ఆదేశించారని తెలుస్తోంది. జగన్ తీసుకున్న నిర్ణయం వైసీపీకి లాభం చేస్తుందని అంటున్నారు. అటు షర్మిలకు జగన్ నిర్ణయంతో నష్టం అని ఆమె భావిస్తోందంట. ఎందుకంటే ఎంత మంది తనను తిడితే తనకు అంత సింపతీ వస్తుందని.. పైగా తనకేదో అన్యాయం జరిగిందని ప్రజలు నిత్యం మాట్లాడుకోవాలంటే.. ఈ వివాదం గురించి వైసీపీ మాట్లాడాలని ఆమె కోరుకుంటోంది. అప్పుడే జనాల నోర్లలో అది నానుతుందని ఆమె ఆశ. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఆమెకు ఇది నష్టమే అంటున్నారు. మొత్తానికి జగన్ సరైన నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు.




