Revanth Reddy : బీజేపీ నేతలకు గాలం వేయబోతున్న కాంగ్రెస్.. వారందరినీ లాగేస్తారా..?
Qubetvnews - February 17, 2024 / 08:46 AM IST
Revanth Reddy :
కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ దూకుడు పెంచుతోంది. మొన్నటి వరకు కాస్త అటు ఇటుగా ఉన్న కాంగ్రెస్ తెలంగాణ అధిష్టానం ఇప్పుడు రూటు మార్చినట్టు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలపై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ పెట్టిన రేవంత్.. ఇప్పుడు ప్రతిపక్షాలకు కౌంటర్ వేసేందుకు రెడీ అవుతున్నారు. బీఆర్ఎస్ దూకుడుకు కల్లెం వేసేందుకు ఎత్తుగడలు ప్లాన్ చేసుకుంటున్నారు. అంతే కాకుండా బీఆర్ఎస్ లోని కొంత మంది ఎమ్మెల్యేలను కూడా లాగేసే అవకాశాలు లేకపోలేదు. అయితే కేవలం బీఆర్ఎస్ ను మాత్రమే టార్గెట్ చేయాలని అనుకోవట్లేదంట.
ఎందుకంటే కాంగ్రెస్ లో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన నేతలు చాలా వరకు బీజేపీకి వెళ్లిపోయారు. చాలా నియోజకవర్గాల్లో కీలక నేతలుగా ఎదిగిన వారందరూ బీజేపీలోనే ఉన్నారు. అలాంటి వారు మొన్న బీజేపీ నుంచి టికెట్లు రాక ఇబ్బంది పడ్డారు. ఇంకొంత మందికి టికెట్లు వచ్చినా సరే గెలవలేకపోయారు. బీజేపీలో కొమ్ములు తిరిగిన నేతలు కూడా గెలవలేదు. దాంతో బీజేపీ రోజు రోజుకూ తెలంగాణలో డీలా పడిపోతోంది. ఈ కారణంగా ఆ పార్టీకి గ్రాఫ్ పడిపోతోంది కాబట్టి ఆ పార్టీలో నుంచి వెళ్లిపోయేందుకు చాలా మంది రెడీ అవుతున్నారు. దాంతో వారిపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు.
బీజేపీ నుంచి బీఆర్ఎస్ కు వలసలు పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. వారందరూ కాంగ్రెస్ లోకి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీజేపీలో కీలకంగా ఉన్న నేతలను తీసుకుని వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు ఆశ చూపించి వారిని కాంగ్రెస్ లోకి లాక్కోవాలని చూస్తున్నారు. దాని వల్ల కాంగ్రెస్ బలపడుతుందని ఆశిస్తున్నారు రేవంత్ రెడ్డి. త్వరలోనే ఇందుకోసం ప్రత్యేకంగా కొందరు మంత్రులను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే బీఆర్ ఎస్ పాఠాలను తిరిగి గులాబీ పార్టీకే అప్పగించాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టు సమాచారం. రేవంత్ ఏదైనా పని చేయాలనుకుంటే దాన్ని చేసి తీరే వరకు నిద్ర పోకుండా ఉంటారు.
అందుకే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల లీడర్లను లాగేసే పనిలో పడ్డారు రేవంత్. రీసెంట్ గా ఉత్తమ్, కోమటిరెడ్డి, జగ్గారెడ్డిలు కూడా ఇలాంటి కామెంట్లే చేశారు. కాబట్టి చూస్తుంటే త్వరలోనే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్, బీజేపీ నుంచి భారీగా వలసలు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.



